ప్ర. సువర్చలాదేవి హనుమంతుడి భార్యయేనా? " తం నిత్యమనురక్తాస్మి యధా సూర్యం సువర్చల "
అని సుందరకాండలో సీతమ్మ అన్నట్టు ఉంది. దీనిని బట్టి సువర్చల సూర్యపత్ని కదా! మరి
ఆంజనేయుడికి భార్య ఎలా అయింది?
స. సువర్చల అనే మాటకు స్త్రీకాదు అర్ధం. "సుష్టు వర్చః లాతి ఇతి సువర్చలా " గొప్ప తేజస్సు యొక్క
సముదాయం అని అర్ధం. సూర్యమండలాన్ని తేజస్సు ఎలా వదలదో, ఆ కాంతిని స్త్రీరూప భావంతో
ఇలా చెప్పింది.సూర్యుని తేజస్సుని విశ్వకర్మ తగ్గించడానికి ఆ తేజస్సును స్త్రీరూపంలో చేస్తే ఆమె
సువర్చల అయిందని పరాశరసంహితలో ఉంది.హనుమంతుడికి అసలు వివాహమే కాలేదు.

ప్ర. వివాహాలకు పనికివచ్చే దక్షిణాయనం, ఉపనయనాలకు ఎందుకు పనికిరాదు. శూన్యమాసాలు
అంటూ కొన్ని నెలలు, మూఢములు అంటూ కొన్ని నెలలు వర్ణించారెందుకు?
స . వివాహ ముహూర్తములకు నియమం వేరు. ఉపనయనానికి వేరు. గాయత్రీమంత్ర ఉపదేశం
కలది కావున ఉత్తరాయణం వుండి తీరాలి. సూర్యునియొక్క నక్షత్ర, రాశులలో, సంచారాలను
బట్టి కొన్ని శుభకార్యాలకు,ముహూర్తములకు నిషిద్ధం. అవి జ్యోతిష్యశాస్త్ర నిర్ణయం.మూఢములు
అనగా శుభముహూర్తములకు ప్రధానమైన బృహస్పతి, శుక్రగ్రహాలు సూర్యుడి అక్షాంశలో వెళ్ళినప్పుడు
అస్తమిస్తాడు. కావున నిషిద్ధము.


ప్ర. ఆత్మహత్య మహాపాపమని, ఆత్మహత్య చేసుకున్నవారు పిశాచం అవుతారు అంటారు. మరి ఆయుష్షు
పూర్తి అయితేనే కదా మరణించేది. మరి ఎలా పిశాచం అవుతారు. ఆయుర్దాయం చెల్లినపుడు ఆత్మహత్య
ఎలా అవుతుంది.
స. మృత్యువు రెండు రకాలు. కాల మృత్యువు, అపమృత్యువు. కాలమృత్యువనేది ఆయుష్షు పూర్తి అయితే
వచ్చేది. అపమృత్యువనేది ప్రమాదాలవల్ల ప్రయత్నం చేత వచ్చిపడేది. దీనిని నివారించడానికి ప్రయత్నించే
సాధనాలు వున్నాయి. ఆయుష్షు తీరి సక్రమంగా మరణించే స్తితి లేకున్నా ఇటువంటివి కలుగవచ్చు.
ఇటువంటి ప్రమాదాలవల్ల శరీరం పోతుంది. కాని ఆయుర్దాయం వుంది కాబట్టి ప్రేతశరీరం తప్పదు.



ప్ర. దృతరాష్ట్రుడు కోరగా దుర్యోధనునికి మైత్రేయ మహర్షి జ్ఞానోపదేశం చేస్తే అది వినక తన తొడలు కొట్టి
చూపించగా, మైత్రేయమహర్షి నీ తొడలు భీముని చేతిలో విరుగుతాయి అని శాపం ఇచ్చాడు గదా!
భీముడు దుర్యోధనుని తొడలు విరగగొట్టడానికి ఇదే కారణమా?
స. భీముడు దుర్యోధనుని తొడలు విరగగొట్టగా బలరాముడు ధర్మద్రోహం అని ఆక్షేపించగా, మైత్రేయ
మహర్షి శాపఫలితమే ఇది అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇదిగాక మరో రెండు కారణాలు-- 1)
ద్రౌపదిని తొడలపై కూర్చోమని పిలవడం 2) కలి యుగంలో గదాయుధ్ధంలో ఇది దోషం కాదు అని
యుగధార్మాన్ని చూపడం కూడా జరిగింది.



ప్ర. కైక భరతునికి పట్టాభిషేకం చేయమని దశరధుని కోరింది. శ్రీరాముడు అలాగే భరతునికి రాజ్యం
అప్పగించి, అరణ్య వాసానికి వెళ్ళాడు. కాని భరతుడు అరణ్యానికి వచ్చినప్పుడు అతనికి తన
పాదుకలను ఇచ్చాడేగాని రాజముద్రికను ఇవ్వలేదు. కనుక శ్రీరాముడు కైకకు అన్యాయం చేసినట్టే
గదా?
స. కైక భరతునికి పట్టాభిషేకం చేయమని దశరధుని కోరింది కాని అది పద్నాలుగేళ్ళు మాత్రమే కోరింది
కాని శాశ్వతంగా కోరలేదు.కనుక భరతుడు పద్నాలుగు సంవత్సరములు రాజప్రతినిధిగా అయినాడు.
కాని శాశ్వతంగా శ్రీరాముడే రాజు కనుక రాజముద్రిక అతనివద్దనే వుండవలసి వచ్చింది. కనుక అది
ఇవ్వలేదు. భరతునికి రాజ్యపాలన చేసే శక్తి కలుగడానికి శ్రీరాముడు పాదుకలను ఇచ్చాడు.