ప్ర.భారతంలో 'విదురనీతి ' ప్రసిద్ధం. అలాగే 'కణికనీతి ' అనే ఘట్టం ఉంది. అది ఎవరు ఎవరికి చెప్పారు?
జ. కణికుడు దుర్యోధనునికి చెప్పినది.

శకుని యొక్క ఆప్తమంత్రి కణికుడు. ఆ కణికుడు దుర్యోధనునికి ఉపదేశించిన నీతి కణికనీతి. ఆదిపర్వం ఆరవ ఆశ్వాసంలో పద్దెనిమిది పద్యాలలో కణికుడి ఉపదేశాలు ఉన్నాయి. ఎవ్వరినీ విశ్వసింపక ఎల్లపొద్దు ఆత్మరక్షాపరుడై రాజు ఉండాలని, ఇప్పుడిలా ఉంటూనే దుర్జనుడు వంచిస్తాడని రాజనీతిలో శత్రువుని ఎలాగైనా అధిగమించాలని ఇలా పలు విషయాలు బోధిస్తాడు కణికుడు.



ప్ర.'జననీ,జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ ' అన్న మాట సంస్కృత, భారత, భాగవత, రామాయణాల్లో దేనిలోనిది?
జ.రామాయణం లోనిది.

రావణుడు మరణించాక లంకా పట్టణం రాముడి హస్తగతమైంది. అయోధ్యలో భరత శత్రఘ్నులున్నారు. లంకా పట్టణాన్ని రాముడు తానే పాలించవచ్చు లేదా లక్మణుడికైనా ఇవ్వొచ్చు. కాని రాముడు అలా చేయలేదు.

"అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణా! రోచతే
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ "

లక్ష్మణా! బంగారంతో తళతళా మెరిసిపోతున్న ఈ లంకా పట్టణం నన్ను ఆకర్షించడం లేదు. అయినా కన్నతల్లి, కన్న దేశం స్వర్గం కంటే చాలా గొప్పది కదా ' అంటూ లంక ఎంత సిరిసంపదలు కలదైనా మనకెందుకని చెప్పి వారసుడైన విభీషణుడికి పట్టం కట్టాడు శ్రీరాముడు. అందుకే ధర్మమూర్తి అయ్యాడు.



ప్ర.పాండురంగ విఠలుని మహిమని తెలిపే అయిదాశ్వాసాల ప్రబంధం రాసిన కవి ఎవరు?
జ.తెనాలిరామకృష్ణుడు

పాండురంగమహత్మ్యం అనే ప్రబంధాన్ని తెనాలి రామకృష్ణుడు రచించాడు. పాండురంగ విఠలుని మహిమను తెలిపే ప్రబంధం ఇది. ఇందులో పుండరీకుని చరిత్ర, నిగమశర్మోపాఖ్యానం, శ్రీకృష్ణావతార చరిత్ర మొదలైన ఉపాఖ్యానాలున్నాయి.



ప్ర.కవి సమయాలను అనుసరించి స్త్రీల ముఖంలోని వేటిని ప్రవాళము, బింబము, బంధూకము(మంకెనపువ్వు), జపాపుష్పం, పల్లవము మొదలైనవాటితో పోలుస్తారు.
జ.అధరములు

పల్లవాధరములు,అధరబింబము వంటి ప్రయోగాలు పెదవులను వర్ణిస్తూ కవులు చేసేవే దొండపండు వంటి పెదవులు అంటారు. పెదవులు ఎర్రనివి, మృదువైనవి, లేతవి సౌందర్యవంతాలు కనుక ఈ పోలికలు చెప్తారు.