1. మత్స్య పురాణం : మత్స్యావతారమెత్తిన శ్రీ మహావిష్ణువు మనువుకు బోధించిన పురాణం ఇది. యయాతి, సావిత్రి, కార్తికేయ చరిత్రలు ఇందులో ఉన్నాయి. అంతేకాక వారణాసి, ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాల వివరణ ఇందులో ఉంది.

2. మార్కండేయ పురాణం : ఇది మార్కండేయ ఋషి చెప్పినది కనుక దీనికి ఈ పేరు వచ్చింది. శివుడు, విష్ణువు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుల మహత్తు గురించి ఇందులో వివరించారు.

3. భాగవత పురాణం : దీన్ని తెలుగులోకి పోతన కవి అనువదించారు కనుక తెలుగు ప్రజలకు ఇది చిరపరిచితమైన పురాణమే. ఇందులో మహావిష్ణు అవతారాల గురించి , శ్రీకృష్ణుని లీలల గురించి వివరించారు. తెలుగులో ఇది మొత్తం 12 స్కంధాల గ్రంధం.

4. భవిష్య పురాణం : ఇది సూర్యభగవానుడు మనువుకు చెప్పిన పురాణం. ఇందులో వర్ణాశ్రమాల ధర్మాల అగురించ్, భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి వివరించారు.

5. బ్రహ్మ పురాణం : ఇది దక్షునికి బ్రహ్మదేవుడు చెప్పిన పురాణం. శ్రీకృష్ణుడు, మార్కండేయుడు, కశ్యపుల జీవన గాథలు ఉన్నాయి.

6., బ్రహ్మాండ పురాణం : బ్రహ్మ మరీచికి చెప్పిన పురాణం ఇది. పరశురాముడి గురించి, రాముడి గురించి, శ్రీకృష్ణుని గురించి ఇందులో వివరించారు. ఇందులో దేవతాస్తోత్ర శ్లోకాలు కూడా ఉన్నాయి.

7. బ్రహ్మవైవర్త పురాణం : ఇది నారద మహర్షికి సావర్ణుడు చెప్పిన పురాణం. సృష్టికి మూలమైన భౌతిక జగత్తు గురించి, పంచమహా శక్తుల గురించి ఇందులో ఉంది.

8. వరాహ పురాణం : ఇది విష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన పురాణం. పార్వతీ పరమేశ్వర చరిత్ర, ధర్మశాస్త్ర శ్లోకాలు, వ్రత విధానాలు ఇందులో ఉన్నాయి.

9.వామన పురాణం : నారదునికి పులస్త్య ఋషి వివరించిన పురాణం ఇది. శివపార్వతుల కళ్యాణం, కార్తికేయగాధ, భూగోళ వర్ణన, రుతువర్ణన ఇందులో ఉన్నాయి. ఆర్యభట్టులాంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని శ్రద్ధగా చదివినట్లు ఆధారాలున్నాయి.

10. వాయు పురాణం : ఇది వాయుదేవుడు ఉపదేశించిన పురాణం. ఇందులో శివమహత్యముతో పాటు భూగోళ వర్ణన, సౌరమండల వ్యవస్థ వర్ణన కూడా ఉండి. మన ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని కూడా అధ్యయనం చేశారు.

11. విష్ణు పురాణం : ఇది మైత్రేయునికి పరాశర మహర్షి ఉపదేశించిన పురాణం. విష్ణు, శ్రీకృష్ణ, ధృవ, ప్రహ్లాద, భరతుల గురించి విపులంగా వివరించారు.

12. నారద పురాణం : ఇది నారదుడు నలుగురు బ్రహ్మ మానసపుత్రులకు చెప్పిన పురాణం. ఇందులో వ్రతాల గురించి, వేదాంగాల గురించి కూడా వివరించారు. వివిధ పుణ్యక్షేత్రాల వర్ణన ఇందులో ఉంది.

13. అగ్ని పురాణం : ఇది అగ్నిదేవుడు ప్రవచించిన పురాణం. వైద్యం, వ్యాకరణం, చందస్సు, భూగోళ శాస్త్రం, జ్యోతిష్యం గురించి ఇందులో ఉన్నాయి.

14. స్కంద పురాణం : ఇది స్కందుడు చెప్పిన పురాణం. ఇందులో అనేక వ్రతాల గురించి, శివమాహత్మ్యం గురించి ఇంకా వివిధ పుణ్యక్షేత్రాల గురించి వివరించారు.

15. గరుడ పురాణం : ఇది తన వాహనమైన గరుడునికి (గరుత్మంతునికి) శ్రీమహావిష్ణువు ఉపదేశించిన పురాణం. గరుడుని జన్మవృత్తాంతముతో పాటు స్వర్గలోకం గురించి, నరకలోకం గురించి, విష్ణు ఉపాసన గురించి ఇందులో వివరించారు.

16. లింగ పురాణం : ఇందులో శివుని ఉపదేశాలు, ఇతర వ్రతాలు, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం మొదలైన వాటి గురించి వివరించారు.

17. కూర్మ పురాణం : శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో ఉపదేశించిన పురాణం కనుకే దీనికి ఈ పేరు వచ్చింది. ఇందులో వరాహ అవతారం గురించి, నరసింహావతారం గురించి వివరించారు. భూగోళం గురించి కూడా వివరించారు.


18. పద్మ పురాణం : 18 పురాణాలలోకెల్లా ఇది పెద్దది. ఇందులో బ్రహ్మ చేసిన సృష్టి గురించి, గంగా మహాత్మ్యం గురించి, గాయత్రీ చరితం గురించి, గీత గురించి, పూజా విధానం గురించి వివరంగా వర్ణించారు.