శ్రీ రామ నవమి వచ్చిందంటే సీతారామ కళ్యాణాలు వాడవాడలా జరిపించి ఆనందిస్తాం కాని శ్రీ కృష్ణాష్టమికి మాత్రం కళ్యాణాలు జరిపించడం ఎక్కడా చూడం. అష్టమహిళల శృంగార నాయకునికి కళ్యాణం జరిపించే సాహసం మానవులు చెయ్యకూడదు. ఎందుకంటే ఓ భామని కూచోబెట్టి వేడుకగా కళ్యాణ మహోత్సవం జరిపిస్తే మరో భామ అలిగి శిక్షిస్తుందేమో అని భీతితో మానవులు శ్రీ కృష్ణ కళ్యాణం జోలికి పోరేమో!

మహర్షులకు రుక్మిణీ కళ్యాణం మాత్రమే కోరిక కలిగితే మనము అష్ట వివాహ వేడుకలు చూద్దామా!!


రుక్మిణి : విదర్భ దేశాధీశుడైన "భీష్మకుడు" అను చక్రవర్తి కుమార్తె "రుక్మిణి" అయిదుగురన్నలతోడ గారాబు పట్టియై పుట్టింది. ఆమె అన్న రుక్మి చెల్లెలిని తన స్నేహితుడు "శిశుపాలు" నికిచ్చి బాంధవ్యం పెంచుకుందామని ఆశపడ్డాడు. కాని రుక్మిణీదేవి మాత్రం శ్రీకృష్ణుని యందే మనసు నిలుపుకుని ఒక బ్రాహ్మణుని ద్వారా తన మనసు తెలిపి తనను చేకొనమని శ్రీకృష్ణుని వద్దకు రాయబారము పంపించింది. ఆమె మొరాలకించిన శ్రీకృష్ణుడు మహాలక్ష్మి సంభూతురాలైన రుక్మిణీదేవిని పట్టమహిషిగా స్వీకరించాడు.


జాంబవతి : సాధారణంగా రుక్మిణి తర్వాత సత్యభామని గౌరవిస్తున్నాం. కాని వాస్తవానికి ఆ స్థానం జాంబవతిది. సత్యభామ తండ్రి అయిన సత్రాజిత్తు తన వద్ద ఉన్న రోజుకి పదహారు బారువుల బంగారం ప్రసాదించే శ్యమంతకమణిని శ్రీకృష్ణుడు దొంగిలించాడన్న అభాండం పరమాత్మ మీద మోపేడు. అంతట ఆ గోపాలుడు, సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి అడవికి వేటకు వెళ్ళాడని తెలుసుకుని అటు వెళ్ళాడు.కాని ప్రసేనుని ఒక సింహం చంపగా ఆ సింహాన్ని ఒక యెలుగుబంటి చంపి ఆ మణిని పట్టుకెళ్ళిన జాడ తెలుసుకుని ఆ యెలుగుబంటితో(పూర్వయుగంలో శ్రీరామబంటు జాంబవంతుడు) 12 రోజులు యుద్ధం చేశాడు. విషయం తెలుసుకున్న ఆ భక్తాగ్రేసరుడు క్షమాపణ చెప్పుకుని స్వామిని నొప్పించినందుకు శ్యమంతకమణితో పాటు తన కుమారీ మణిని కూడా పరంధామునికి సమర్పించి ధన్యుడయ్యాడు.


సత్యభామ : నూతన వధూ సమేతుడై యింటికొచ్చిన గోవిందుడు సత్రాజిత్తుకు జరిగిన కథను చెప్పగా అతను సిగ్గుపడి శ్రీకృష్ణుని బహువిధముల స్తుతించి తన కుమార్తె సత్యభామను స్వీకరించమని కోరి ప్రార్ధించి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి తను తరించి, పెద్దలను తరింపజేశాడు. మణిని కూడా సమర్పించాడు. కాని వాసుదేవుడు మణిని తిరస్కరించి కుమారీమణిని తీసుకొని ఇంటికెళ్ళాడు.


నాగ్నజితి : కోసల దేశాధీశుడైన నగ్నజితి అనే మహారాజు రాజ్యంలో వృషభాలు మదించిన ఏనుగుల మాదిరిగా ఊరిమీదపడి ప్రజలను బాధిస్తుండగా ఆ నాగ్నజితు యెవరైతే వృషభాలను బంధిస్తారో వారికి తన కుమార్తెనిచ్చి పెళ్ళి చేస్తానని చాటించాడు. పెళ్ళికి ఆశ పడకపోయినా లోకోపకారార్ధం దేవకీ సుతుడు వెళ్లి అనాయాసంగా వృషభాలను బంధించాడు. రాజుగారు అన్నమాట ప్రకారం తన కుమార్తె నాగ్నజితినిచ్చి అంగరంగ వైభవంగా పెళ్ళి చేశాడు.


కాళింది : కాళింది సూర్యుని కూతురు. ఆమె విష్ణుమూర్తి భర్త గావాలని తపస్సు చేసింది. కృష్ణార్జునులు యమునా నదిలో స్నానం చేయటానికి వెడితే ఆవిడ కామవాంచతో కృష్ణుని చూచింది. అర్జునుడు ఆమె వివరాలు అడిగి ఆమె మనోగతాభిప్రాయం కృష్ణునికి చెప్పి యిద్దరికీ సంధానం చేశాడు. గోపాలుడు ఆమె భక్తికి మెచ్చి ఆమెను ద్వారక తీసికెళ్ళి వివాహం చేసుకున్నాడు.


మిత్రవింద : శ్రీ కృష్ణుని మేనత్త కూతురు. అవంతీ దేశాధీశులు, యోధానుయోధులు, ధర్మాత్ములు అయిన విందాను విందుల చెలియలు. రాధాదేవి కూతురు. స్వయంవరంలో శ్రీకృష్ణుని వరమాల వేసి వరించిందీమె.

భద్ర : శ్రుతకీర్తి అనే రాజు పుత్రిక. ఈమె సకల సలక్షణ సమన్విత. జాగ్రత్త గల నడవడిక కలది. కృష్ణుడికి మేనమరదలి వరుస. శ్రీకృష్ణునికి యిద్దరు భార్యలు మేనరికం.

లక్షణ : బృహత్సేనుని ముద్దుల కూతురు లక్షణ. ఈమె శ్రీకృష్ణుని గుణగణాలు, మాయలు, రూపురేఖలు, సామర్ధ్యము నారదుని వల్ల విని అతనినే పెండ్లాడ గోరింది. ఆమె తండ్రి ఒక మత్స్య యంత్రం ఏర్పాటు చేసి దానిని కొట్టిన వానికి కూతురుని ఇస్తానని చాటించాడు. అనేక దేశాధీశులు, రాజకుమారులు ప్రయత్నించి విఫలమయ్యాక నందనందనుడు సునాయాసంగా మత్స్యాన్ని పడేశాడు. లక్షణ తన లక్ష్యం సిద్ధించిందని ఆనందించి వరమాల వేసి వరించింది. శ్రీకృష్ణుడు తనకు అడ్డు వచ్చిన రాజులందరినీ యెదురించి లక్షణని తీసుకుని ద్వారక చేరాడు.