1.జపం చేసేటప్పుడు రుద్రాక్షమాలతో చేస్తారు కదా! దాన్ని కొందరు మెడలో వేసుకుంటారు ఎందుకు? దాన్ని ధరించటంలో ఏమైనా విశేషమున్నదా?

జ.రుద్రాక్ష చాలా పవిత్రమైనది. అది రుద్రరూపమంటారు. దాంతో జపం చేయటం విశేష ఫలాన్ని ఇస్తుంది. దాన్ని ధరించడం వలన బి.పి వగైరాలు తగ్గుతాయి. అందుకని ఎప్పుడూ ధరించడం చాలా మంచిది కూడా.



2. దేవాలయానికి ప్రదక్షిణలు మూడుసార్లు చేస్తారు. తీర్ధం కూడా మూడు సార్లు ఇస్తారు. ఈ 3 అంకెకు ఏమైనా ప్రత్యేకత ఉందా?

జ.ఇంకొక మాట కూడా ఉంది.'ముమ్మాటికి ' చెప్పారంటారు. అంటే త్రికరణ శుద్దిగా అని అర్ధం. మనస్సు,వాక్కు,శరీరం - ఈ మూడు కలిసి చేసిన పని గట్టిగా గుర్తింపు అవుతుందని ప్రతిదాన్నీ మూడుసార్లు చేస్తారు. మన పనులలో మూడు అంకెకు ఇదీ ప్రాధాన్యత.



3. మన మనస్సు, ఆత్మ వేరుగా పని చేస్తాయా?లేక ఏది దేని మీద పని చేస్తుంది? రెండూ ఒకటైతే పేర్ల భేధమెందుకు?

జ. ఆత్మ పని చెయ్యదు. అది జీవరూపము. దాని శక్తితో మనస్సు పని చేస్తుంది. మనస్సును నడిపించేది ఆత్మే. మనస్సు నడచినట్లెల్ల నడిస్తే జీవుడవుతాడు. మనస్సును నడిపించేటప్పుడు ఈశ్వరుడౌతాడు.



4. దేవుడు సృష్టించిన మనుష్యులలో 'వారు,వీరు,తమరు ' అని బహువచనముతో పిలుస్తారు కదా! దేవుని ఏకవచనముతో ఎందుకు పిలుస్తారు మరి?

జ.జీవులయందు దేహాభిమానం వుంటుంది కనుక మర్యాద కోసం పిలుస్తారు. దేవుడు ఆత్మస్వరూపుడు కనుక స్వతంత్రంగా ఏకవచనముతో పిలవ్వచ్చు.



5. జీవ హింస పాపం కదా! భక్తకన్నప్ప జంతువులను చంపి పరమశివునికి నైవేద్యం పెట్టాడంటారే. తిన్న శివుడు, ఇచ్చిన కన్నప్ప పాపం మూట కట్టుకున్నట్టే కదా?

జ. కన్నప్ప మాంసం భుజించే అలవాటు ఉన్నవాడు. "యదన్నః పురుషోభవతి తదన్నాః తస్య దేవతాః" మానవుడు ఏది భుజిస్తే అదే ఆహారంగా దేవతలకు పెట్టవచ్చు. అతనికి 'ఇది తప్పు, పెట్టకూడదు ' అని లేదు. భక్తితో ఎవడు పెట్టినా భగవంతునికి మాంసాహారం, శాకాహారం అని భేదాలు లేవు. కనుక్ ఐందులో ఎవరికీ దోషం లేదు.