బ్రహ్మదేవుడు దీక్షగా కూచుని రకరకాల పక్షులను తీర్చిదిద్దుతున్నాడు. పిచికలు, గోరువంకలు, రామచిలుకలు,పాలపిట్టలు, కణుజులు ఇలా ఒక్కోదానికి ఒక్కొక్క పేరు ఖాయం చేస్తున్నాడు. అన్నీ చిన్న చిన్నవే అవుతున్నాయని ఒక పెద్ద పక్షిని ఊహించి, తయారుచేయడం మొదలు పెట్టాడు. దాని రూపురేఖలు, రంగులు అన్నీ కొత్తగా దిద్దాడు. దానికి రెక్కలను చిన్నదిగా, చిత్రంగా అమర్చాడు. పొడవైన తోక పెట్టాడు. దానికి చిత్రాతిచిత్రమైన యీకలు కూర్చాడు. అది తలుచుకుంటే ఆ తోకను విసనకర్రలా విప్పగలదు. అప్పుడు ఆ పక్షి ఆకర్షణీయంగా కనిపిస్తుంది.


అంతా గమనిస్తున్న సరస్వతీదేవి ఆ పక్షి అందచందాలకు మురిసిపోయింది. "దానికి మంచి నాట్యకౌశలం కూడా వుంటే, ఆ చక్కదనానికి మరింత శోభ చేకూరుతుంది" అని దేవి సలహా ఇచ్చింది. "అది నీపని, నువ్వే అనుగ్రహించాలి" అన్నాడు బ్రహ్మ. ఆమె అనుగ్రహించి దానికి "నెమలి" అని పేరు పెట్టింది. చివరకు దానిని వదలలేక తన వాహనంగా స్థానం కల్పించింది. నెమలి అందానికి, ఆటకి సార్ధకత చేకూరిందని బ్రహ్మ ఆనందించాడు. నెమలి ముఖంలో మాత్రం ఆనందం కనిపించలేదు. "ఏమిటీ నీ కోరిక?" అన్నాడు విరించి. "ఒక్క బ్రహ్మ లోకానికే పరిమితం కావడమా?" అని సణిగింది నెమలి. అయితే కుమారస్వామికి వాహనమై కైలాసంలో గెంతులు వెయ్యమని కటాక్షించాడు. నెమలి ఆ మాట వినగానే ఒక్కసారి పురివిప్పి ఆనందంతో నాట్యం చేసింది.


నాట్యం కాగానే నెమలి పించం ముడుచుకుంది. దానితో పాటు దాని ముఖమూ చిన్నపోయింది. "మళ్ళీ ఏమైంది?" అన్నారు బ్రహ్మ, సరస్వతి. "మరి విష్ణులోకంలో నా సంగతి తెలిసేదెలా?" అని దీనంగా ముఖం పెట్టింది నెమలి. బ్రహ్మకు ఆ మాట వినగానే "బ్రహ్మకోపం" వచ్చింది. కాని సంబాళించుకున్నాడు. ఎంతైనా తను ఏరికోరి తయారుచేసిన జీవి కదా! పైగా అది అనూహ్యంగా అద్భుతంగా తయారైంది. అందుకని తెలియకుండానే దాని మీద ఇష్టం, మమకారం క్షణక్షణం పెరిపోసాగింది. కోపాన్ని అణచుకొని "విష్ణులోకంలో కాదు. ద్వాపర యుగంలో నెమలీక కృష్ణుని తలపై కిరీటంలో నిత్యం రెపరెపలాడుతుంది. సరేనా!" అన్నాడు. నెమలి ముఖం దీపంలా వెలిగింది.


బ్రహ్మదేవుడు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పటికైనా తృప్తిపడినందుకు. నాలుగు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వచ్చింది నెమలి. బ్రహ్మ, సరస్వతి ప్రశ్నార్ధకంగా చూశారు. "అంతా బానే ఉంది. నెమలి కన్నుకి ఒకవైపే రంగులు అద్దావుగాని రెండోవైపు అట్లాగే వదిలేయడం ఏమీ బాలేదు." అంది నెమలి చిన్నబోయిన మొహంతో. బ్రహ్మదేవుడు తన మూడు తలలను ఏకకాలంలో పట్టుకున్నాదు.